హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): ప్రపంచంలోనే వీధి కుక్కలు, పిల్లులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ జంతువులు దేశంలో దాదాపు 8 కోట్ల వరకు ఉండగా.. వాటిలో 6.2 కోట్లు వీధి కుక్కలు, 91 లక్షల పిల్లులు, షెల్టర్ హోంలలో 88 లక్షల శునకాలు, పిల్లులు ఉన్నాయి. భారత్లోని జనాభాలో దాదాపు 77 శాతం మంది తాము వారానికి ఒకసారైనా వీధి కుక్కను చూస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 68 శాతం మంది వారానికి ఒకసారి వీధి పిల్లిని చూస్తున్నామన్నారు. ‘పీపుల్ ఫర్ ఎనిమల్స్’కు చెందిన గౌరీ ములేఖి మాట్లాడుతూ దేశంలో ప్రతి 100 మంది జనాభాకు కనీసం మూడు వీధి కుక్కలు ఉన్నాయని తెలిపారు.