శ్రీనగర్ : ఆఫ్ఘన్ను ఆక్రమించిన అనంతరం నిన్న తాలిబన్లు కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇస్లామిక్ సూత్రాల’ మేరకు మిలిటెంట్ గ్రూప్ సుపరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మానవ హక్కులను గౌరవించాలని కొత్త ప్రభుత్వాధినేతలను కోరారు.
ప్రతి దేశంతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. బుధవారం ఆయన శ్రీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాలిబన్లు తమ పౌరుల హక్కులను కాపాడాలని, వారికి న్యాయమైన, గౌరవప్రదమైన ప్రభుత్వాన్ని అందజేయాలన్నారు. ఇదిలా ఉండగా.. మహ్మద్ హసన్ అఖుంద్ను యాక్టింగ్ ప్రధానమంత్రిగా నియమించినట్లు తాలిబన్లు మంగళవారం ప్రకటించారు.
ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్, ముల్లా అబ్దుస్ సలాంను డెప్యూటీలుగా, తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్ ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ కొత్త రక్షణ మంత్రిగా, యాకూబ్ ముల్లా హెబతుల్లా సైనిక కమిషన్ చీఫ్గా నియమించారు. హక్కానీ నెట్వర్క్ అధిపతి జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీకి అంతర్గత వ్యవహారాల, అమీర్ ఖాన్ ముత్తాకీని విదేశాంగ మంత్రిగా నియమించిన విషయం తెలిసిందే.