జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై ఘన విజయం సాధించగా.. హిమాచల్ 5 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్ను చిత్తు చేసింది. కర్ణాటకతో పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. జగదీశన్ (102) సెంచరీతో చెలరేగగా.. సాయి కిషోర్ (61), దినేశ్ కార్తీక్ (44) రాణించారు. ఆఖర్లో షారుక్ ఖాన్ (39 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో తమిళనాడు భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో రఘుపతి 4, వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 207 పరుగులు చేసింది. రింకూ సింగ్ (76) టాప్స్కోరర్. చేజింగ్లో హిమాచల్ 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ప్రశాంత్ చోప్రా (99), నిఖిల్ (58) మెరిశారు. బుధవారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్స్లో విదర్భతో సౌరాష్ట్ర.. సర్వీసెస్తో కేరళ తలపడుతాయి.