అయిజ, నవంబర్ 26: నీటి సదుపాయం కలిగిన రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి చెరుకు పంటను సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉందని చెరుకు పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని రైతు వేదికలో మాజీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎల్ క్రిష్టవేణి షుగర్స్ లిమిటెడ్ పరిశ్రమ సౌజన్యంతో చెరుకు పంట సాగు చేస్తున్న రైతులతో పాటు ఆసక్తి కలిగిన రైతులకు చెరుకు పంట సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. చెరుకు సాగుకు ఎర్ర నేలలు, గరప నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు అనువైనవన్నారు. చెరుకు పంట సాగుకు సరైన వంగడాన్ని ఎంచుకోవాలన్నారు. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భూమి సారవంతం పెంచేందుకు సేంద్రియ ఎరువులను వాడితే అధిక దిగుబడులు వస్తాయన్నారు. పంట దిగుబడికి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 786 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. వచ్చే వానకాలం నాటికి జిల్లాలో 2వేల ఎకరాల వరకు రైతులు చెరుకు పంట సాగు చేసే విధంగా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. చెరుకు పంటను క్రిష్టవేణి షుగర్స్ లిమిటెడ్ పరిశ్రమ కొనుగోలు చేసి, నెల రోజులలోనే నగదును బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాలకు జమ చేస్తుందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రైతు వేదికలో పంటల సాగుపై అవగాహన సదస్సులను నిర్వహించడం గర్వకారణమన్నారు. అనంతరం చెరుకు సాగులో అధిక దిగుబడులు సాధించిన రైతులను సన్మానించారు. సమావేశంలో ఏడీఏ సక్రియా నాయక్, ఏవో శంకర్ లాల్, క్రిష్టవేణి షుగర్స్ లిమిటెడ్ ఏజీఎం యాదగిరి, సీనియర్ మేనేజర్ వరదరాజన్, మాజీ ఎంపీపీలు సుందర్రాజు, సీతారాంరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ రాముడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్, ఏఈవోలు రైతులు పాల్గొన్నారు.