హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులుగా బదిలీపై ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల పిల్లలను కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు స్థానిక కోటా కింద వెసులుబాటు కల్పిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఆ అవకాశం కల్పించకపోవడం అన్యాయమే అవుతుందని పేరొన్నది. స్థానిక కోటాకు చెందిన జీవో 150ను సవరించాలని, ఈ సవరణ చేసేలోగా తమ తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
సత్వరమే జీవో 150ను సవరించి రాష్ట్రం వెలుపల పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా స్థానిక కోటా కింద ప్రయోజనం కల్పించాలని తెలిపింది. ఈఎస్ఐ కార్పొరేషన్లో పనిచేస్తూ తిరుపతికి బదిలీ అయిన తన తండ్రి తిరిగి హైదరాబాద్కు వచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం స్థానిక కోటా వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ కే సంహిత దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఇటీవల విచారణ పూర్తి చేసింది.
ప్రవేశ నిబంధనల్లోని రూల్ 3(ఏ)(3)ను సవరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా స్థానిక కోటా పరిధిలోకి తీసుకువచ్చేలా జీవో 150లో మార్పులు చేస్తామని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చినందున ప్రభుత్వ ఉత్తర్వుల రాజ్యాంగబద్ధతపై ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని పేర్కొన్నది. ప్రతిపాదిత సవరణ జరిగే వరకు పిటిషనర్ తరహాలో ఇతర కేంద్ర ఉద్యోగుల పిల్లలు ఇబ్బంది పడకుండా చూడాలని స్పష్టం చేసింది. 2026-27 ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియలో పిటిషనర్ను స్థానిక కోటా కింద పరిగణించి కౌన్సెలింగ్కు అనుమతించాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది.