హైదరాబాద్ : హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డి ధర్మాసనం మూడు పిటిషన్లపై విచారణ జరిపింది. మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్, వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి, హుజూరాబాద్లో దళితబంధు కొనసాగించాలని లక్ష్మయ్య, జడ్సన్ న్యాయస్థానాన్ని కోరారు.
ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకాలు, ఉప ఎన్నిక పూరయ్యే వరకు నిలిపివేయాలని వాచ్ వాయిస్ పీపుల్ సంస్థ కోరింది. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రకటించి.. హుజూరాబాద్ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పథకాన్ని కొనసాగించేలా చూడాలంటూ మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ హైకోర్టును ఆశ్రయించారు.