తిరువనంతపురం : కేరళలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా మరికొందరు మృతి చెందారు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది. ఆది, సోమవారాల్లో శబరిమలలోని ఆలయానికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది.
వానలతో శబరిమల కొండలు అధిరోహించడం ప్రమాదమేమి కాకపోయినా.. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలకు వరదలు వస్తున్నాయని, పంబా నదిలో నీటిమట్టం ప్రమాదస్థాయిని దాటిందని బోర్డు పేర్కొంది. కొట్టాయంలోని కొట్టికల్, ఇడుక్కి జిల్లాలోని కొక్కయార్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు వెలికి తీసినట్లు కేరళ మంత్రి వీఎన్ వాసవన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కేరళ పరిపాలన సైతం ప్రజలు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని నదులు, పర్యాటక ప్రదేశాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా.. తులామాసం సందర్భంగా పూజల కోసం అయ్యప్ప ఆలయం శనివారం తెరుచుకున్నది. అయితే కొవిడ్ నిబంధనల మేరకు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి గురువారం వరకు స్వామివారిని దర్శించుకునేందుకు దేవస్థానం బోర్డు అనుమతి ఇచ్చింది. వర్చువల్ విధానంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది.
అలాగే కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నట్లుగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదంటే.. కొవిడ్ నెగెటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది. ఈ నెల 21న తిరిగి ఆలయాన్ని మూసివేయనుండగా.. మళ్లీ నవంబర్ 2న అత్త చితిర పూజ కోసం తెరువనున్నారు. ఆ పూజ పూర్తయిన మరునాడే ఆలయాన్ని మూసేస్తారు. తిరిగి, మండలం, మకరవిలాక్కు పండుగ నేపథ్యంలో నవంబర్ 15న ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు.