ములుగు, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 25న రూ.90 లక్షల విలువైన 612 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ డాక్టర్ సంగ్రాం సింగ్ జీ పాటిల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిందితుడి అరెస్టుతో పాటు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 25న ఉదయం 9గంటల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి ములుగు జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు మంగపేట ఎస్సై తాహెర్బాబా ఆధ్వర్యంలో పోలీసులు తిమ్మంపేట క్రాస్ రోడ్డు వద్ద మధ్యాహ్నం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న టాటా వెంచర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో 21 బస్తాల్లో 612 కిలోల గంజాయి లభ్యం కాగా, డ్రైవర్ వెంబటి రాజశేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. తనది నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామమని, తనతో పాటు మరో నలుగురు ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోతుగూడెం గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఎండు గంజాయిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు ఒప్పుకున్నాడు. డ్రైవర్ రాజశేఖర్పై కేసు నమోదు చేసి గంజాయితో పాటు టాటా వెంచర్ వాహనం, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మిగిలిన నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ వెల్లడించారు.