నిజామాబాద్ : జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తన వందలాది మంది అనుచర గణంతో సోమవారం గులాబీ గూటికి చేరారు.
దీంతో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన తరువాత బీజేపీకి రాం రాం చెప్పి టీఆర్ఎస్లో చేరిన ఎంపీటీసీ సభ్యుల సంఖ్య అయిదుకు చేరింది.
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ ఎంపీటీసీ బాలనర్సయ్య బీజేపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో సోమవారం బాల నర్సయ్య, వందలాది మంది ఆయన అనుచరులు గులాబీ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే రెండు మూడు నెలల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీతో సహా ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు ఉధృతంగా ఉంటాయని, ఇక వార్ వన్ సైడేనని అన్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ నిజామాబాద్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీకి తొలి విజయాన్ని అందించిన ఘనత సాధించారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వం పై విశ్వాసంతో, ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల వారు టీఆర్ఎస్ లో చేరడానికి ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.
అభివృద్ధి లో ఆర్మూర్ నియోజకవర్గం అగ్రగామిగా పురోగమిస్తున్నదన్నారు. పార్టీలో చేరుతున్న నాయకులకు సముచితమైన స్థానం కలిపిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ సంతోష్,ఎంపీపీ నరసయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఆలూరి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు మహేందర్,శ్యామ్, రంగన్న, ప్రభుదాస్, రాజారెడ్డి ,శ్రీను,చేపూర్ సర్పంచ్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది ముదిరాజ్ సామాజిక వర్గీయులు కూడా జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన వందలాది మంది బీజేపీ కార్యకర్తలు జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.