Heatwave in AP : దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం వేళ జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. దాదాపు దేశమంతటా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అయితే రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ బుధవారం 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. గురువారం అది మరింత పెరిగి 48.1 డిగ్రీలకు చేరింది. ఏపీలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం.
ఇక ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా టి గుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు 18 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా, 20 జిల్లాల్లోని సుమారు 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వచ్చే సోమవారం వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.