హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని తెలిపారు. 12వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, 13న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 41 నుంచి 41.7 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో 41.7 డిగ్రీలు, ఖమ్మం జిల్లా కొణిజర్ల, ములుగు జిల్లా వెంకటాపురం, నల్లగొండ జిల్లా గుడిపల్లి, నిజామాబాద్ జిల్లా భీమ్గల్, నిర్మల్ జిల్లా మామడలో 41.6 డిగ్రీలు నమోదయ్యాయని వెల్లడించారు.
అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో కారణంగా వాతావరణంలో అనూహ్యమార్పులు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం జూన్ నుంచి ప్రారంభం కావచ్చని చెబుతున్నారు. యురోపియన్ వెదర్ ఫోర్కాస్ట్ సంస్థ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు. 2018లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ సమయంలో ఉష్ణోగ్రతలు భారీ గా, వర్షపాతం తక్కువగా నమోదయ్యాయని గుర్తుచేస్తున్నారు.