హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు, నీళ్లు, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. గచ్చిబౌలి ఏఐజీ దవాఖాన ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం లో వైద్యులు పోషించిన పాత్ర మరువలేనిదని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో వైద్యులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఐఎంఏ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడుతానని అభయమిచ్చారు. ఈ సందర్భంగా సావనీర్ను ఆవిష్కరించారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం సంపత్రావు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్రెడ్డి పాల్గొన్నారు.