సిద్దిపేట, మార్చి 14 : మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లాలో మొదటి దశలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా క్లినిక్లను ప్రారంభించగా, మంగళవారం జిల్లాలోని మహిళా ఆరోగ్య కేం ద్రాల్లో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 వరకు మహిళలకు వైద్య సేవలు అందజేశారు.
ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న 8 ప్రధాన ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం సేవలు అందించనున్నారు. 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు, సిద్దిపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ బస్తీ దవాఖానలకు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి వైద్య సేవలు పొందారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు మహిళా ఆరోగ్య కేంద్రాలపై మహిళలకు అవగాహన కల్పించారు. దీంతో ఉదయం నుంచి మహిళలు ఆరోగ్య కేంద్రాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తొలిరోజు జిల్లాలో 533 మంది మహిళలకు వైద్య సేవలు అందించారు.
జిల్లాలో వైద్య సేవలు
ప్రారంభమైన మహిళా ఆరోగ్య కేంద్రాలు
జిల్లాలో తిమ్మపూర్, తీగుల్, ముస్త్యాల, ములుగు, సింగన్నగూడెం, వర్గల్, మర్కూక్, హుస్నాబాద్, మద్దూరు, ఇందుప్రియాల్, తోటపల్లి, చిన్నకోడూరు, ఇందిరమ్మకాలనీ బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా ఆరోగ్య ప్రారంభమయ్యాయి. ఆరోగ్య కేంద్రాల్లో రెఫర్ చేసిన వారికి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానలో స్కానింగ్, సిటీస్కాన్, ఎక్స్రే చేసి వైద్య సేవలు అందజేశారు.