హైదరాబాద్ : భక్త రామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన ఉన్న ప్రముఖ వాగ్గేయకారుడు భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి 389 వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అయోధ్య తర్వాత అంత గొప్పగా చెప్పుకోదగిన శ్రీరాముని దేవాలయాన్ని నిర్మించి భక్త రామదాసుగా ఎన్నో కీర్తనలు రచించి, శ్రీరాముడి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
భక్త రామదాసు జయంతి ఉత్సవాలను భాషా సాంస్కృతిక శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి వారి జన్మ స్థలమైన నేలకొండపల్లిలో నిర్వహిస్తున్నామన్నారు.
తెలుగు జాతి, సంస్కృతి ఉన్నంత కాలం రామదాసు రచనలు ఉంటాయని, వారి భక్తి, ఆధ్యాత్మిక సంపద భారత దేశానికే గర్వకారణంగా భావించ వచ్చని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ,ప్రముఖ విద్యావేత్త రామదాసు, హరిహర ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, దైవజ్ఞ శర్మ, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.