న్యూఢిల్లీ, మే 7: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గృహ రుణాలపై బెంచ్మార్క్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) పెంచుతున్నట్టు సంస్థ శనివారం ప్రకటించింది. దీంతో ప్రస్తుత రుణ గ్రహీతలతో పాటు కొత్తవారికీ రుణాలు మరింత ఖరీదవుతాయి. ప్రస్తుత రుణగ్రస్తుల ఈఎంఐలు పెరుగుతాయి.
రిజర్వ్బ్యాంక్ హఠాత్తుగా రెపో రేటును పెంచిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంక్లు రేట్లను వడ్డించిన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ ప్రకటన వెలువడింది. తమ గృహ రుణాల రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) 30 బేసిస్ పాయింట్లు పెంచుతున్నామని, కొత్త రేట్లు మే 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. రుణ మొత్తం, కాలపరిమితినిబట్టి కొత్త వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 7.45 శాతం వరకూ ఉంటాయి. ప్రస్తుతం అవి 6.70 శాతం నుంచి 7.15 శాతం వరకూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలోనే హెచ్డీఎఫ్సీ తన బెంచ్ మార్క్ రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచింది.