హైదరాబాద్, అక్టోబర్ 22, (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య దాఖలు చేసిన పిల్పై విచారణ ఈ నెల 25కు వాయిదాపడింది. ఈ పిల్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తుండగా, ఇతర న్యాయవాదులు శశికిరణ్, శరత్కుమార్ జోక్యం చేసుకొన్నారు. ఇదే అంశంపై తాము దాఖలు చేసిన వ్యాజ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. హుజారాబాద్ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు దళితబంధును నిలిపివేయాలని ఈ నెల 4న తాము పిల్ దాఖలు చేసినట్టు శశికిరణ్ చెప్పారు. మిగిలిన రెండు కేసులు విచారణ జాబితాలో లేనందున మూడు పిల్స్ను కలిపి ఈ నెల 25న విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది.