Harish Rao | బస్తీ దవాఖానాల నిర్వహణలో నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అందులో డాక్టర్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి స్టాఫ్ నర్స్ను దీనిపై నిలదీశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేటలో నాలుగు చోట్ల బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని హరీశ్రావు గుర్తుచేశారు. అందులో ఒక్క కేసీఆర్ నగర్లోని బస్తీ దవాఖానలో మినహాయించి మిగతా మూడు బస్తీ దవాఖానలు కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డిపల్లి, ఆర్అండ్బీ కార్యాలయం సమీపంలో ఉన్న వాటిల్లో గత ఆరు నెలల నుంచి డాక్టర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు డాక్టర్లేక, మెడికల్ ఆఫీసర్ రూమ్ పెచ్చులు ఊడిపోయి, డాక్టర్ కూర్చునే కుర్చీలో దుమ్ముపట్టి ఉండటంపై సీరియస్ అయ్యారు. ఇదేనా బస్తీ దవాఖాన తీరని ప్రశ్నించారు. డాక్టర్లు లేకుండా ప్రజలకు వైద్యం ఎలా అందిస్తారని నిలదీశారు.
పేద ప్రజల కోసం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సుస్తీ దవాఖానలుగా మార్చిందని హరీశ్రావు విమర్శించారు. ఒకవైపు ఆరు నెలలుగా డాక్టర్లు రావడం లేదు.. మరోవైపు ఉన్న అటెండర్కు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. బస్తీ దవాఖానాలో ఉన్న స్టాఫ్ నర్స్కు నవంబర్ నెల జీతం ఇప్పటికీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టాఫ్ నర్స్ను దవాఖానలో అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మల్టీ విటమిన్, లోప్రెమైడ్, లివో సిట్రిజన్, మెటాఫిన్తో పాటు ఉండాల్సిన గ్లిమిఫిరైడ్ 2ఎంజీ లేవని.. చిన్న పిల్లలకు సంబంధించిన జింక్ సల్ఫేట్ కూడా లేవని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వస్తలేడు.. మందులు లేవు.. అలాంటప్పుడు ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. పేద ప్రజలకు అందించే ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యం వీడాలని సూచించారు. వెంటనే బస్తీ దవాఖానల్లో వైద్యులను ఏర్పాటు చేయాలని, సకాలంలో మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.