హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో హెచ్చరించింది. ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, మూలధన వ్యయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేసింది. 2023-24తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పులు రూ.43,829 కోట్లు (11%) పెరిగినట్టు వెల్లడించింది. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.65,537 కోట్లు అప్పుగా పొందిందని, ఇందులో ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్’ (చేబదులు)గా రూ.5,842 కోట్లు తెచ్చిందని పేర్కొన్నది. 2020-21లో రూ.2.34 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ అప్పులు 2024-25 నాటికి రూ.3.91 లక్షల కోట్లకు పెరిగాయని, ఇదే సమయంలో మొత్తం అప్పులు రూ.2.78 లక్షల కోట్ల నుంచి రూ.4.47 లక్షల కోట్లకు చేరాయని వివరించింది. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో దాదాపు 27 శాతానికి సమానమని పేర్కొన్నది. దీంతో భవిష్యత్తులో వడ్డీ చెల్లింపులు భారీగా పెరిగి అభివృద్ధి వ్యయాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది.
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఎంతో కీలకమైన మూ లధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,072 కోట్లకు చేరిందని, ఇది జీఎస్డీపీలో కేవలం 2.20 శాతమేనని ‘కాగ్’ నివేదిక వెల్లడించింది. జీఎస్డీపీ వృద్ధిరేటుతో పోలిస్తే మూలధన వ్యయం ఆశించిన స్థాయిలో పెరగలేదని పేర్కొన్నది. 2023-24లో మూలధన వ్యయం పెరిగినప్పటికీ 2024-25లో మళ్లీ తగ్గుదల నమోదైనట్టు తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మూలధన వ్యయంలో నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసింది. ఆ రంగానికి రూ. 22,643 కోట్లు (63 శాతం) ఖర్చు చేసింది. రహదారులు, వంతెనలకు రూ. 4,243 కోట్లు, మైనర్ ఇరిగేషన్ (చిన్న నీటిపారుదల)కు రూ.1,237 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.892 కోట్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.774 కోట్లు, విద్య, క్రీడలు, కళలు, సాం స్కృతిక రంగాలకు రూ.311 కోట్లు, ఇతర వ్య యాల కింద రూ.5,723 కోట్లు (16 శాతం) వెచ్చించినట్టు ‘కాగ్’ నివేదిక వెల్లడించింది.