హయత్నగర్ రూరల్, నవంబర్ 25 (కూకుట్లపల్లి రాకేశ్) : బర్త్ డే అంటే ఏడాదికోసారి వచ్చేది. ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. పుట్టిన వెంటనే చిన్నారుల బర్త్డే చేసేస్తున్నారు నేటి తల్లిదండ్రులు. పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు ప్రతినెలా అదే తేదీన వేడుక జరుపుకొంటున్నారు. ప్రత్యేక థీమ్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఫొటోలు తీసి జ్ఞాపకాలను పదిలంగా భద్రపర్చుకుంటున్నారు. చిన్ని చేతులతో కేకులను కట్ చేయిస్తూ మురిసిపోతున్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ.. పిల్లలతో మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. తాము మిస్సయిన కలలను, తాము అనుభవించని సంతోషాలను తమ పిల్లల్లో చూసుకుంటూ సంబురపడుతున్నారు. ఇందుకోసం కొంతమంది తల్లిదండ్రులు ఎంత ఖర్చుకయినా వెనుకాడటం లేదు. మరికొందరు మాత్రం తక్కువ ఖర్చులతో కొత్తగా ఆలోచిస్తున్నారు. విభిన్నంగా ఏడాది వరకు ప్రతి నెలా పిల్లల పుట్టినరోజు వేడుకను జరుపుకొంటున్నారు. తమ పిల్లలను కొందరు చెఫ్లుగా కనిపించేలా అందంగా తయారుచేస్తుంటే.. ఇంకొందరు స్పైడర్ మ్యాన్లను తలపించేలా సిద్ధం చేస్తున్నారు. మరికొందరు తమ థీమ్లలో కూరగాయలు, పూలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా తయారుచేయించిన పిల్లలను ఫొటోలు తీయిస్తున్నారు. సోషల్మీడియాలో పెడుతూ.. అందరికీ తమ ఇంటి ఆనందాలను తెలియజేస్తున్నారు.