హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విషయంలో కూడా కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శించిందని, స్వయంగా సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. బీజేపీ ఎనిమిదేండ్లలో ఎనిమిది మంది ఎన్నికల కమిషనర్లను మార్చిందని పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఈసీ, ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులపై దాడులను చేయిస్తోందన్నారు. తద్వారా దేశంలో ఫెడరల్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ నియంతలా పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రతిపక్ష ముక్త్భారత్ అనేలా వ్యవహరిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 18 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేశారని ఆరోపించారు. అకడితో ఆగకుండా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్తో పాటు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, అందుకే షిండే లాంటి వారు పుట్టుకొస్తున్నారన్నారు. మరోవైపు తమ మాట వినని రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల వ్యవస్థ ద్వారా పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 26న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, అలాగే, గవర్నర్ల వ్యవస్థ రద్దు కోరుతూ డిసెంబర్ 7న సీపీఐ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తాం
భవిష్యత్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం చేస్తేనే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో అమిత్షాను రప్పిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. అమిత్ షాకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఆర్వో శ్రీనివాస్రావు హత్యను ఖండిస్తున్నామన్నారు. పోడుభూముల సమస్యకు హత్యలు పరిషారం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, మెగా టెక్స్ టైల్ పారు సాధన కోసం సీపీఐ పోరాడుతుందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, రాష్ట్ర నాయకులు టీ వెంకట్రాములు, నేదునూరి జ్యోతి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, మేకల రవి, సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, షేక్బాష్మియా, నాయకులు ఆదరి శ్రీనివాస్, మద్దెల ఎల్లేశ్, మండ సదాలక్ష్మి, దండు లక్ష్మణ్, ఉటూరి రాములు, కర్రె లక్ష్మణ్, కొట్టెపాక రవి, వెంకటరమణ, బీ సంతోష్, ప్రసన్న, శరత్ పాల్గొన్నారు.