మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 7 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతికత వినియోగంలో ఏమాత్రం తీసిపోరని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ధూళిమిట్ట హైస్కూల్ హెచ్ఎం కరుణాకర్రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షల విభాగం ఇన్చార్జి చిలుక వెంకటయ్య ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు రంజిత్కుమార్ ‘క్యూఆర్ కోడ్’తో హాల్టికెట్లు రూపొందించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి ప్రారంభం కానున్న సమ్మేటివ్ అసెస్మెంట్-2(ఎస్ఎ-2) పరీక్షల కోసం డిజిటల్ హాల్టికెట్లను హెచ్ఎం అందజేశారు.
విద్యార్థులకు ఇచ్చిన హాల్టికెట్పైన వారి వివరాలతో కూడిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఇన్విజిలేటర్లు తమ స్మార్ట్ఫోన్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి, సెక్షన్, హాల్టికెట్ నంబర్ తదితర వివరాలన్నీ మొబైల్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతికతను అందించాలనే లక్ష్యంతో క్యూఆర్ కోడ్ విధానాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ అద్భుత ప్రయోగానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.