Summur | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ)/మంచిర్యాల ఏసీసీ/ములుగు రూరల్: భానుడి భగభగలతో రాష్ట్రమంతా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ సోకి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ఆదివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. శుక్రవారం వడదెబ్బ సోకి ములుగు జిల్లా ములుగు మండలం మదనపల్లికి చెందిన తాపీ మేస్త్రీ చీలపాక సాల్మోహన్ (50), సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం పదో వార్డుకు చెందిన టైలర్ మొలుగూరి సురేశ్ (30), నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో వ్యవసాయ కూలీ రామగిరి లక్ష్మీనర్సయ్య (48), నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన హమాలీ గన్నెపాక కొండయ్య (48), సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన సెక్యూరిటీ గార్డు కస్తాల మహేశ్ (45) మృతి చెందారు. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అకడకడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. తప్పక వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతుంటే కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శుక్రవారం హైదరాబాద్తోపాటు వివిధ చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో వర్షం పడగా కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం పడగా, కుట్టకింది తండాలో ఈదురుగాలుల ధాటికి ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి.