Congress MLAs : ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (DPCC) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేసి ఆ పార్టీకి షాకిచ్చారు. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్బై చెప్పారు.
మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయ, నసేబ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వారి రాజీనామా లేఖలను విడివిడిగా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆప్తో పొత్తుపెట్టుకోవడం నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు తమ రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు.
ఇటీవల డీపీసీసీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఆప్తో పొత్తును నిరసిస్తూ పార్టీని వీడారు. పీసీసీ అధ్యక్షుడినైన తన అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఆప్తో పొత్తు కుదుర్చుకున్నారని విమర్శిస్తూ ఆయన పార్టీని వీడారు. ఇప్పుడు ఆయన బాటలోనే మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.