న్యూజిలాండ్: వెస్టిండీస్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన భారత యువ క్రికెటర్లు అదరహో అనిపించారు. శనివారం అర్ధరాత్రి ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో యువ భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. ఈ క్రమంలో ఐదోసారి ప్రపంచ విజేతగా నిలిచిన యంగ్ఇండియాను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ సహా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, క్రికెటర్లు అభినందనలు తెలిపారు. ఓవైపు కరోనా వైరస్ బారిన పడినా..ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మెగాటోర్నీలో అజేయంగా కప్పును ముద్దాడిన టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టోర్నీ బరిలోకి దిగిన ప్లేయర్లందరికీ రూ.40 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహమిస్తున్నట్లు బోర్డు చీఫ్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. స్వదేశం చేరుకున్న తర్వాత అహ్మదాబాద్లో యువ క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని బీసీసీఐ తెలిపింది.
రిషిత్రెడ్డికి హెచ్సీఏ రూ.10 లక్షలు:
అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుకు ఎంపికైన హైదరాబాద్ యువ ఆల్రౌండర్ రిషిత్రెడ్డికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తగిన గుర్తింపునిచ్చింది. రిషిత్కు రూ.10 లక్షల నగదు బహుమతిని హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించారు. మరోవైపు టోర్నీలో నిలకడగా రాణించిన యువ క్రికెటర్ షేక్ రషీద్కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈ విషయాన్ని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ క్రికెటర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత క్రికెట్ వెలుగులీనుతున్నది.
– కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి