నల్లగొండ : కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఆ రాష్ట్రాల సీఎం లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక సెంటర్ లో కంటి వెలుగును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రములో విద్య, వైద్య అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు.
వంద రోజుల్లో తెలంగాణ ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్టంలో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని వెల్లడించారు.
దేశప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోవాలని కోరుకుంటున్నారని చైర్మన్ తెలిపారు. అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, రాష్ట్ర అగ్రోస్ సంస్థ చైర్మన్ విజయసింహరెడ్డి, ఆడిషనల్ కలెక్టర్ ఖుష్భూ గుప్తా తదితరులు పాల్గొన్నారు.