నల్లగొండ : రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి రుజువైందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మడిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ దేశానికి అత్యున్నతమైన పార్లమెంట్ను, అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ను అవమానించారన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోడీ వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు. రాష్ట్రంపై బీజేపీకి, ప్రధాని మోదీకి ఎంత అక్కసు ఉందో ఆయన వ్యాఖ్యలతో అర్థమవుతుందన్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలను అమలు చేయడం లేదా? అంటూ కేంద్రాన్ని పరిశీలించారు. తెలంగాణపై విద్వేషపూరిత వివక్షను కేంద్రం చూపిస్తుందని, మోదీ దేశానికి ప్రధానిగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. నోటికి ఏదిస్తే అది మాట్లాడే బీజేపీ తెలంగాణ ఎంపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం నిధులు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పేదలకు చేసిందేమీ లేదని, ఆయన అధాని, అంబాని వంటి పారిశ్రామికవేత్తల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి చేయడం చేతకాక ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్ర పనిగా పెట్టుకొందని విమర్శించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలోనే బీజేపీ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.