హైదరబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల విద్యార్థులు దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సొంతం చేసుకున్నారు. మారుమూల అటవీ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన, నాణ్యమైన విద్యాసౌకర్యాలను కల్పించటం వల్ల దేశం గర్వపడే రీతిలో ఎదిగారు. ఈ విద్యాసంవత్సరం తొలివిడత కౌన్సెలింగ్లో 295 మంది గురుకుల విద్యార్థులు జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు 153 మంది, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు 142 మంది ఐఐటీ, నిట్, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఎస్ వంటి సంస్థల్లో సీట్లు కైవసం చేసుకున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్ అభినందించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద, అణగారినవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రయత్నానికి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు సాధించటమే నిదర్శమని పేర్కొన్నారు.