హైదరాబాద్, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సకల సౌకర్యాలతో రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు సమగ్ర మూర్తిమత్వం లభించేలా బోధన సాగుతుండటంతో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ కోర్సుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి అశోక్సాయి ఎంపికయ్యాడు. రక్షణశాఖ ఆధ్వర్యంలో సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) నిర్వహించిన అన్ని పరీక్షల్లో సత్తా చూపా కలను సాకారం చేసుకొన్నాడు. అశోక్సాయిని షెడ్యూలు కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకుల విద్యాలయ సంస్థ సెక్రటరీ రొనాల్డ్ రోస్ అభినందించారు. ఈ సందర్భంగా అశోక్సాయి ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలు పంచుకున్నారు.
కుటుంబ నేపథ్యం..
మాది నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి. అమ్మానాన్నలు ధనలక్ష్మి-కృష్ణయ్య. నాకు ఇద్దరు అక్కలు. నాన్న పక్షవాతంతో పని చేయలేని స్థితి. అమ్మ టైలరింగ్ చేస్తుంటే, చిన్నక్క ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ జాబ్ చేస్తూ నన్ను చదివించారు. పెద్దక్క పెండ్లి చేశాం. నేను 8వ తరగతి వరకు హైదరాబాద్లో, 9,10 నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలో, ఇంటర్ విద్యను కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్లో పూర్తి చేశా. ఇప్పుడు ఎన్డీఏకు ఎంపికయ్యా.
పైలట్ శిక్షణకు ఎంపికైన విధానం?
ఫైటర్ పైలట్ శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు జాతీయస్థాయిలో 5 దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. మొదటగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో యూపీఎస్సీ రాత పరీక్షలో పాస్ కావాలి. గత ఏప్రిల్లో 4 లక్షల మంది రాశారు. మెరిట్ సాధించిన 9 వేల మందిని రెండోదశ స్క్రీనింగ్ టెస్ట్కు ఎంపికచేశారు. 517 మందిని మూడు, నాలుగు దశల్లో నిర్వహించే ఫ్లయింగ్ ఆప్టిట్యూడ్, మెడికల్ టెస్ట్కు ఎంపిక చేశారు. జాతీయస్థాయిలో 92 సీట్లకు అభ్యర్థులను ఎంపికచేశారు. అందులో నేను ఒకడిని.
రుక్మాపూర్ స్కూల్లో ఎలాంటి శిక్షణ ఇచ్చారు?
ఫైటర్ పైలట్ శిక్షణకు ఎంపికయ్యానంటే అంతా రుక్మాపూర్ స్కూల్లో కల్నల్ రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు ఇచ్చిన తర్ఫీదు ఫలితమే. రెగ్యులర్ ఇంటర్ కోర్సులతో పాటు వైమానిక, ఆర్మీ, నేవీ ఎంపికలకు నిర్వహించే వివిధ పోటీపరీక్షల పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. యూపీఎస్సీ పరీక్షకు కోచింగ్ ఉంటుంది. మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూలు ఇలా అన్ని విధాల శిక్షణ వల్లే ఎంపిక కాగలిగాను. నాలాంటి పేద విద్యార్థులకోసం సైనిక పాఠశాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, శిక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా. దేశానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. అదే నా కల. జీవితాశయం. ప్రభుత్వ చేయూతో అది నెరవేరింది.