Gukesh | చెన్నై: ఇటీవలే కెనడాలోని టొరంటో వేదికగా ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం స్వదేశానికి తిరిగొచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో అతడికి ఘన స్వాగతం లభించింది. స్వాగత సత్కారాల తర్వాత గుకేశ్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘విష్షీ సార్ (విశ్వనాథన్ ఆనంద్) సార్ నాకు చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఆయన అకాడమీలో చేరడంతో నేను చాలా మెరుగయ్యాను. ఆయన లేకుంటే ప్రస్తుతం నేను ఉన్న స్థితికి దరిదాపుల్లో కూడాఉండేవాడిని కాను..’ అంటూ ఆనంద్కు కృతజ్ఞతలు తెలిపాడు. చెన్నైలోని ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెస్ట్బ్రిడ్జ్-ఆనంద్ చెస్ అకాడమీ (వాకా)లో గుకేశ్ 2020 నుంచి శిక్షణ పొందుతున్నాడు.