హైదరాబాద్ : మద్యం దుకాణాల కేటాయింపుల విషయంలో రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5శాతం కేటాయించిన విషయం తెలిసిందే. దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమలు చేస్తూ.. 2021-23 సంవత్సరాలకు నూతన మద్యం పాలసీని శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొత్త జిల్లాల యూనిట్గా మద్యం దుకాణాల కేటాయింపు జరుగనున్నది. ఆయా జిల్లాల్లో ఉన్న దుకాణాలు ఆధారంగా ఈ కేటాయింపుల ఆధారంగా కలెక్టర్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కమిటీ దుకాణాలు కేటాయించనున్నది. కమిటీలో కలెక్టర్తో పాటు జిల్లా ఎక్సైజ్ అధికారి, గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమశాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారిని ప్రభుత్వం నియమించింది. డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు, వీడియో చిత్రీకరణను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.