హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోని 19 శాఖలకు సంబంధించిన 503 గ్రూప్-1 పోస్టులకు ఈ నెలలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్కు 90 రోజులు, ప్రిలిమ్స్, మెయిన్స్కు మధ్య 90 నుంచి 100 రోజులు సమయమివ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు క్యాలెండర్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. పలుశాఖలు ఇప్పటికే టీఎస్పీఎస్సీకి ఇండెంట్లను సమర్పించగా, ఒకట్రెండుశాఖల నుంచి ఇంకా అందాల్సి ఉన్నది. ఇవి అందగానే పరిశీలించి నోటిఫికేషన్ జారీచేస్తారు. గ్రూప్-1 పోస్టుల ప్రక్రియనంతా 2023 ఆగస్టులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలో, మెయిన్స్ వ్యాసరూప ప్రశ్నలుగా ఉంటుంది. ప్రిలిమ్స్లో నిర్దిష్ట కటాఫ్ మార్కు ల ప్రకారం ప్రతిభ సాధించిన అభ్యర్థులను మెయిన్స్కు అవకాశమిస్తారు. మెయిన్స్ ఫలితాలకు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశమున్నది. మెయిన్స్ ఫలితాల తర్వాత ఒక పోస్టుకు కొంత మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలకు ముందే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ మార్కులు కలిపి తుది ఫలితాలను ప్రకటించారు. ఇంటర్వ్యూల నిర్వహణకు రెండు నెలలు పడుతుందని అధికారులు అంచనా వేశారు.