హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య మండలి (జీఆర్ఎంబీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ సర్కారు అందజేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లను సెంట్రల్ వాటర్ కమిషన్కు (సీడబ్ల్యూసీకి) పంపడంలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నది. ఏపీ ప్రలోభాలకు లొంగి రెండు నెలలుగా తాత్సారం చేస్తున్నది. అక్కడితో ఆగకుండా పరిధి దాటి వ్యవహరిస్తున్నది. డీపీఆర్లను సీడబ్ల్యూసీకి పంపే అంశాన్ని ఎన్నడూ లేనివిధంగా బోర్డు మీటింగ్లో పెట్టి చర్చిస్తామని తాజాగా మరో మెలిక పెట్టింది. సీతారామ లిఫ్ట్, పీవీ నర్సింహారావు సుజల స్రవంతి (తుపాకులగూడెం), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, మోడికుంటవాగు ప్రాజెక్టు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, చనాకా-కొరాట బరాజ్కు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల క్రితమే జీఆర్ఎంబీకి సమర్పించింది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కొత్తగా ఏవైనా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టినట్టయితే వాటి వల్ల ఇతర రాష్ర్టాల నీటి హక్కులకు ఏమైనా భంగం కలుగుతుందా? లేదా? అనే అంశాన్ని మాత్రమే జీఆర్ఎంబీ పరిశీలించాలని ఏపీ పునర్విభజన చట్టంలోని 85 (8)డీ సెక్షన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు విరుద్ధంగా డీపీఆర్లను పరిశీలించే అంశాన్ని బోర్డు మీటింగ్లో చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జీఆర్ఎంబీ కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఇటీవల తెలంగాణ సర్కారుకు లేఖ రాయడంపై రాష్ట్ర సాగునీటి ఇంజినీర్లు మండిపడుతున్నారు. డీపీఆర్లను సీడబ్ల్యూసీకి పంపకుండా జీఆర్ఎంబీ తాత్సారం చేస్తున్నదని, ఏపీ సర్కారు ఒత్తిళ్లకు లొంగి కొర్రీలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.