Greenery | సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ) : చారిత్రక నగరానికి పచ్చదనం కొంగొత్త అందాలను తీసుకువస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం, నగరంలో గ్రీనరీ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడంతో పచ్చదనం విస్తరిస్తున్నది. పచ్చని మొక్కలతో పర్యాటక ప్రాంతాలకు కొత్త కల వచ్చింది. చారిత్రక నగరానికి గ్రీన్ కవరేజీ అభివృద్ధికి సూచికగా నిలుస్తోంది. ఒకప్పుడు కంటికి కనిపించిన స్థాయిలో కాంక్రీట్ జంగిల్ విస్తరణతో పచ్చదనం మనుగడ కోల్పోతే… స్వరాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి చోట పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్, ఫ్లై ఓవర్ పిల్లర్లు, జంక్షన్ బారికేడింగ్, మిడ్ ఎవెన్యూ ప్లాంటేషన్తో విశ్వనగరానికి పచ్చలహారంగా కనిపిస్తోంది. ఇక జంక్షన్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన గ్రీనరీ ప్లాంటేషన్తో నగరం పచ్చందాలను అద్దుకుంటోంది.
650 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రేటర్ విస్తరించి ఉంది. నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్ సాగర్ పరిసరాలు… ఇప్పుడు ఆధునిక తెలంగాణకు ప్రతీకగా మారాయి. ఓవైపు అంబేద్కర్ నూతన సచివాలయం, ఆ పక్కనే అమవీరుల స్థూపం, రాజ్యాంగ స్ఫూర్తికి నిజరూపంలా అంబేద్కర్ భారీ విగ్రహంతో అందమైన పర్యాటక ప్రాంతంగా మారింది. హుస్సేన్ సాగర్ పరిసరాలు ఇప్పుడు “హార్ట్ ఆఫ్ ద వరల్డ్”గా ఐక్యరాజ్య సమితి టూరిజం సంస్థ గుర్తించే స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇక నగర వ్యాప్తంగా ఉన్న 3500 చెరువులు, కుంటల బ్యూటిఫికేషన్తో విహార కేంద్రాలను తలపిస్తున్నాయి.
దేశంలో ఉన్న మెట్రో నగరాలన్నీ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ గడిచిన మూడేళ్లలో హైదరాబాద్ నగరవ్యాప్తంగా వాతావరణంలో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న వాహన రాకపోకలకు ధీటుగా పచ్చదనం పరుచుకోవడంతో కాలుష్య తీవ్రత తగ్గిపోతుంది. శిలాజ ఇంథనాల వినియోగం తగ్గింపు, జీరో ఎమిషన్, పరిశ్రమలకు నిలయంగా ఉన్న జీరో డిశ్చార్జ్ వంటి వినూత్న కార్యకలాపాలతో పారిశ్రామిక కాలుష్య తీవ్రతను తగ్గించేలా కృషి చేస్తోంది. కోర్ సిటీలో ఉన్న పరిశ్రమలను అవుటర్ దాటించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రేటర్ నగరాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దుతోంది.
హైదరాబాద్ నగరానికి బంగారు వడ్డాణంలా 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అవుటర్ రింగు రోడ్డు కొత్తందాలకు నిలయంగా మారింది. 650లక్షల మొక్కలతో గ్రీన్ కారిడార్గా మారింది. దాదాపు 881 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్, 56లక్షల మొక్కలతో కాలనీ ప్లాంటేషన్, కోటిన్నరకు పైగా ఇనిస్టిట్యూషనల్ ప్లాంటేషన్కు తోడు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఓఆర్ఆర్ వెంట చేపట్టిన బ్లాక్ ప్లాంటేషన్తో పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. 1087 అర్బన్ పార్కులు, 600 నర్సరీలు, 57 థీమ్ పార్కులు, 12.5 హెక్టార్ల ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్, జపాన్ టెక్నాలజీ మియావాకీ అడవుల పెంపకంతో పదేళ్లలో రికార్డు స్థాయిలో గ్రీనరీ నిండిపోయింది. 2011లో 33.15 చ. కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రీన్ కవర్ 2021 నాటికి ఏకంగా 81.81చ. కిలోమీటర్లకు వృద్ధి చెందింది. దీంతో రెండుసార్లు గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు ఏకో ఫ్రెండ్లీ సిటీగా నిలిచింది.
సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. ప్రత్యేక కార్యాచరణతో పర్యావరణహితంగా, పచ్చని నగరంగా హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రాముఖ్యతను తీసుకువచ్చిన అధికారులు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పచ్చదనం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు తొమ్మిదో విడత హరితహారం కింద కోటి మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలో 600 నర్సరీల్లో కోటి మొక్కలు సిద్ధం చేశారు.
ఎల్భీనగర్ , కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లో ఒక్కో జోన్కు 20 లక్షలు, చార్మినార్, సికింద్రాబాద్లో ఒక్కో జోన్కు 14 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 12 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ విధించింది. ప్రధానంగా ఒక్కో కాలనీని యూనిట్గా తీసుకుని కాలనీల్లో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా ఫ్రూట్స్, ఫ్లవరింగ్ మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికల్లా ఎంపిక చేసిన కాలనీల్లో అంతర్గత రహదారులు, ఇనిస్టిట్యూషన్స్, ఖాళీ స్ధలాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించనున్నారు.