సిటీబ్యూరో, డిసెంబర్ 27 : ఫ్లై ఓవర్లు పచ్చని పందిళ్లుగా మారుతున్నాయి. రంగురంగుల అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం.. ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ బయో డైవర్సిటీ విభాగం గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్(నిలువుగా మొక్కల పెంపకం) చేపడుతున్నది. తీరొక్క మొక్కలతో అలంకరిస్తూ ప్రయాణికులకు ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ విభాగం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ (నిలువుగా మొక్కల పెంపకం) చేపడుతున్నారు. ప్రతి వర్టికల్ గార్డెన్ అటోమేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు చేయడం, రోజుకు 100 మిల్లీ లీటర్ల డోస్తో నీరు అందించి ప్రయాణీకులకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లర్లకు అలంకారప్రాయమైన గ్రీన్ వాల్స్ మొక్కలను నాటుతున్నారు. ఫ్లై ఓవర్ల వెంబడి వెళ్లే వాహనదారులు, పాదాచారులకు చక్కటి ఆహ్లాదాన్ని పంచడమే లక్ష్యంగా ఈ వర్టికల్ గార్డెన్ చేపడుతుండడం గమనార్హం.
నగరంలో 100 వర్టికల్ గార్డెన్స్
గ్రేటర్ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద ఉన్న పిల్లర్స్కు నిలువు ఆకారం(వర్టికల్)లో మొక్కలను పెంచుతున్నాం. ఇప్పటి వరకు దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ సంఖ్యలో వర్టికల్ గార్డెన్స్ను ఏర్పాటు చేశాం. సుమారు 79 ఉన్నాయని, కొత్తగా షేక్పేట ఫ్లైఓవర్, ఓవైసీ ఫ్లైవర్, బయోడైవర్సిటీ జంక్షన్ ప్రాంతాల్లోనూ మరిన్ని ఏర్పాటు చేస్తున్నాం. మునుముందు నగరంలో వంద చోట్ల వర్టికల్ గార్డెన్స్ను ఏర్పాటు చేస్తాం. – అర్వింద్ కుమార్, స్పెషల్చీఫ్ సెక్రెటరీ పురపాలక శాఖ