హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్తు బిల్లులతో రైతులకు అపార నష్టం కలుగుతుందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంటులో ఉన్న విద్యుత్తు బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని, మరోసారి రైతులు రోడ్లెక్కే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో బోర్లు, బావులకు కరెంటు మీటర్లు పెట్టే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
సీఎం కేసీఆర్ శనివారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్తు బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకునేవరకు పార్లమెంట్లో పోరాటం చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులోకం చాలా నష్టపోయిందని, వాళ్లను ఆర్థికంగా స్థితిమంతులను చేసి ఆత్మవిశ్వాసంతో బతికేలా చేయడంకోసం అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. నాణ్యమైన కరెంట్ను ఉచితంగా 24 గంటలపాటు అందిస్తున్నామని తెలిపారు. తమ రైతులకు ఉచితంగా కరెంట్ సరఫరా చేసే సామర్థ్యం తెలంగాణకు ఉన్నదని స్పష్టంచేశారు. ఉచిత విద్యుత్తు అందిస్తున్న రాష్ర్టాలపై కొత్త చట్టాలను బలవంతంగా రుద్దరాదని డిమాండ్ చేశారు. ‘మీరు తెచ్చిన బిల్లులపై విద్యుత్తు కార్మికులు, ప్రజలు ఆందోళనతో ఉన్నరు.
ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం ఆందోళనతో ఉన్నది. మేం మీటర్లు పెట్టడానికి సిద్ధంగా లేము. మీరేమో పెట్టాలని అంటున్నరు. చట్టాలు అమలు చేయకుంటే మాపై భయంకరమైన ఒత్తిడి తెస్తున్నరు. మాకు వచ్చే నిధులు నిలిపివేస్తమని అంటున్నరు. ఇది నియంతృత్వ వైఖరి. ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. మీ చట్టాలు, విధానాలు మంచివైతే మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్నకాడ అమలు చేసుకోండి. అందరిమీద రుద్దేలా కఠిన చట్టం తెచ్చి మెడమీద కత్తి పెట్టొద్దు’ అని కేంద్రానికి హితవు పలికారు.