హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యజ్ఞ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడంతోపాటు రూ.10లక్షల నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైభవంగా కొనసాగాయి.
అందులో భాగంగా విశ్వకర్మ ఆత్మగౌరవ భవన్ కోసం ఉప్పల్ భగాయత్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన స్థలంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం పెద్దఎత్తున నిర్వహించారు. ఈ విశ్వకర్మ మహా యజ్ఞానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది విశ్వబ్రాహ్మణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్వకర్మ ఆత్మగౌరవ భవన్ ట్రస్టు చైర్మన్ లాలుకోట వెంకటాచారి అధ్యక్షత వహించగా, బ్రహ్మంగారి మఠం కందిమల్లయ్య పల్లె పూర్వ మఠాధిపతి రెండవ కుమారుడు వీరభద్రస్వామి, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.