సమతా మూర్తి
210 అడుగుల విగ్రహం
108 దివ్య ఆలయాలు
12 రోజుల మహాయజ్ఞం
1035 కుండాలు
5000 రుత్విక్కులు
హైదరాబాద్/సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 : హైదరాబాద్ ముచ్చింతల్లో సమతా స్ఫూర్తి ప్రజ్వరిల్లింది. విశిష్టాద్వైత ప్రవర్తకులు.. సమసమాజ చైతన్య మార్గదర్శి.. భగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన పలువురు జీయర్ స్వాములు, వేలాది రుత్వికుల వేధఘోషతో.. అశేష భక్తావళి అష్టాక్షరి పఠనంతో దివ్యసాకేత ప్రాంగణం భక్తి పారవశ్యంలో తేలిపోయింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పంచలోహ రామానుజుల విగ్రహావిష్కారానికి నాందిగా సంకల్పించిన సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగానికి అద్భుతంగా అంకురార్పణ జరిగింది. ఈ యాగాన్ని స్వయంగా వీక్షించేందుకన్నట్టుగా లక్ష్మీనారాయణులు (పెరుమాళ్లు) శోభాయాత్రగా యాగశాలకు అశ్వవాహనంపై తరలివచ్చారు. ముచ్చింతల్లోని జీయర్ దవాఖాన నుంచి దాదాపు 3 కి.మీ. మేర శోభాయాత్ర సాగింది. అహోబిల జీయర్ స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి, రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరి రామానుజ జీయర్ స్వామి, వ్రతధర రామానుజ జీయర్ స్వామి.. తదితరుల సారథ్యంలో శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. కూచిపూడి నాట్యం, కోలాటాలు.. శ్రీమన్నారాయణ నామ సంకీర్తనల మధ్యన యాగశాల దాకా ఈ యాత్ర సాగింది.
జీయర్ల అనుగ్రహభాషణం
దేవదేవుడు లక్ష్మీనారాయణస్వామి యాగశాలకు చేరగానే వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐదుగురు జీయర్స్వాములు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. సమతామూర్తి గురించిన విశేషాలు, లక్ష్మీనారాయణ యాగానికి సంబంధించిన కార్యక్రమాలు.. దాని విశిష్టతలను వివరించారు. త్రిదండి చినజీయర్స్వామి అనుగ్రహభాషణంతో పూజాదికాలు ప్రారంభమయ్యాయి. మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. మొదట విశ్వక్సేన పూజతో ప్రారంభించి, వాస్తు పూజ, ప్రాం గణ శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సహస్రకుండాత్మక లక్ష్మీనారాయణ యాగానికి వేదోక్తంగా అంకురార్పణ జరిగింది. ప్రధాన యాగశాలలో రుత్విక్కరణం, యజమానులకు కంకణధారణ, జరిగింది. అనంతరం దీక్షలు స్వీకరించి యాగదీక్ష స్వీకరించారు. మొదట ప్రధాన యాగశాలలోని తొలి హోమకుండంలో అగ్ని ప్రతిష్ఠ చేశారు. అదే అగ్నిని ప్రత్యేకంగా 144 యాగశాలల్లో ఏర్పాటుచేసిన 1035 హోమకుండాల్లో ప్రజ్వరిల్లజేశారు. 12 రోజుల పాటు ఈ మహా క్రతువు నిరాఘాటంగా సాగుతుంది.
సమతామూర్తి పోస్టల్ కవర్ ఆవిష్కరణ
వేడుకల్లో భాగంగా రామానుజులవారి సమతామూర్తి విగ్రహంతో కూడిన పోస్టల్ కవర్ను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వీవీ సత్యనారాయణరెడ్డి సమక్షంలో త్రిదండి చినజీయర్స్వామి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఆవిష్కరించారు.
1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి..
రామానుజాచార్య సమారోహంలో భాగంగా 12 రోజులపాటు నిర్వహంచనున్న మహా యజ్ఞం కోసం మొత్తంగా 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. ఈ నెయ్యి మొత్తాన్ని రాజస్థాన్ రాష్ట్రం పాత్మెడాలోని పూర్తి స్వదేశీ ఆవులను తీసుకొచ్చి ముచ్చింతల్, తాండూరులలోని వ్యవసాయ క్షేత్రాల్లో పోషిస్తూ వాటి పాల నుంచి సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేశారు. త్రిదండి చినజీయర్స్వామి మార్గనిర్దేశకత్వంలో దాదాపు 6 నెలల ముందునుంచే యజ్ఞం కోసం నెయ్యిని సిద్ధం చేయడం మొదలుపెట్టడం విశేషం. యజ్ఞ సమిధలను సైతం శాస్త్రబద్ధంగా తయారుచేశారు. ఈ యాగంలో మొత్తం 5 వేల మంది రుత్వికులు పాల్గొంటున్నారు.
సాంస్కృతిక కళా సంరంభం
రామానుజ సహస్రాబ్ది ప్రారంభ కార్యక్రమంలో మహిళల కోలాటాలు, డప్పు దరువులు, ఒగ్గుడోలు నృత్యాలు, వాయిద్యాలు, యక్షగానం, బంజారా, కోయ, గోండు నృత్యాలు భక్తులను అలరించాయి. కూచిపూడి శాస్త్రీయ నాట్యం కన్నుల పండువ చేసింది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులు కళారూపాలను ప్రదర్శించారు. ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు.
మనుషులంతా ఒకటే: జీయర్స్వామి
‘మానవులంతా సమానులేనన్నది శ్రీరామానుజచార్య సిద్ధాంతమని, ఆ నినాదంతోనే సామాజిక, సాంస్కృతిక, లింగ, విద్యా, ఆర్థిక వివక్షతలను ఎదర్కొంటున్న లక్షల మంది ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించారని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఈ క్రమంలోనే రామానుజ సహస్రాబ్దిని పండుగలా జరుపుతున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం, వసుధైక కుటుంబమని చాటిచెప్పేలా స్వామివారి సహస్రాబ్ది ఉత్సవాలను సమానత్వ పండుగలా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మహాయజ్ఞంలో భాగంగా చేస్తున్న వేద మంత్రోచ్చారణ ప్రతి మనిషికి శుభం కలుగజేస్తాయని తెలిపారు. యజ్ఞ క్రతువులు నిర్వహించడం వల్ల సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉన్నదని, మరింతమంది పాల్గొని యజ్ఞ ఆశీర్వచనం పొందాలని పిలుపునిచ్చారు.