వరంగల్ అర్బన్ : రైతులను కష్ట కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ పడ్డారు. ఆయన మనసున్న గొప్ప నాయకుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ధాన్యం కొనుగోలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో పరిస్థితులపై ప్రజాప్రనిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
కరోనా కారణంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతులు ఇబ్బందులు పడకూడదనే రూ.20వేల కోట్ల బ్యాంకు గ్యారంటీతో ధాన్యం కొనుగోలు చేపట్టారని మంత్రులు తెలిపారు.
రైతుల మేలు కోరుతున్న సీఎం నిర్ణయానికి తగినట్లుగా అటు అధికారులు పని చేయాలని, ఇటు రైతులు సహకరించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు మరోసారి శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు.
రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే ఈ సారి రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టుల ద్వారా విపరీతంగా సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఒకవైపు మిషన్ కాకతీయ ద్వారా బాగుపడిన చెరువులను కూడా నీటితో నింపడంతో రైతులు యాసంగిలోనూ వరి ఎక్కువ వేశారన్నారు.
ఈ కారణంగా వర్షాకాలం కంటే యాసంగిలోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరిగి, అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. దిగుబడులకు తగ్గట్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు-ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రులు తెలిపారు.
సధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చలివేంద్రాలు పెట్టాలని, టెంట్లు వేయాలని, సానిటేషన్, కొనుగోలు పద్ధతిలో మాస్కులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామన్నారు. అవసరమైతే పోలీసులు, ఇతర అధికారుల సహాయం తీసుకోవాలని, వారంతా సమన్వయంతో చేయాలని ఆదేశించామని మంత్రులు తెలిపారు. ఇక రైతులు విధిగా టోకెన్ పద్ధతిని పాటించాలని, ధాన్యాన్ని తాలు, తేమ లేకుండా తేవాల్సిందేనని మంత్రులు చెప్పారు.
ఈ విషయమై రైతులను చైతన్య పరిచేవిధంగా కరపత్రాలు, వేయడం, గ్రామాల్లో డప్పు చాటింపులు వేయడం చేయాలన్నారు. అలాగే సన్న రకం వేయలని, పత్తిని అధికంగా పండించాలని, పప్పు ధాన్యాలు పండించాలని, అయిల్ పాం పై రైతులకు అవగాహన పెంచాలని కూడా మంత్రులు అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఓడిసిఎంఎస్ చైర్మమన్ రామస్వామి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, హరిత, కమిషనర్ పమేలా సత్పతి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు