న్యూఢిల్లీ, నవంబర్ 19: క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ డిజిటల్ కరెన్సీల లాభాలపై పన్ను వేసేలా ఆదాయం పన్ను (ఐటీ) చట్టాల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను వచ్చే ఏడాది పార్లమెంట్లో ప్రకటించే బడ్జెట్లో ఈ సవరణల్ని ప్రతిపాదించాలనీ భావిస్తున్నది. రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. కాగా, ఇప్పటికే కొందరు క్రిప్టోకరెన్సీల ద్వారా అందుకుంటున్న ఆదాయంపై మూలధన లాభాల పన్ను చెల్లిస్తున్నారని బజాజ్ చెప్పారు. క్రిప్టోకరెన్సీని ఓ ఆస్తిగా భావిస్తున్నారన్నారు. అయితే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీలో ఇతర సేవలు అన్నది ఉందని, వాటికి ఏ రేటు వర్తిస్తుందో అదే జీఎస్టీ రేటు క్రిప్టోకరెన్సీ లావాదేవీలకూ ఉంటుందని స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీ మదుపరైనా, బ్రోకరైనా, ట్రేడింగ్ వేదికైనా దాన్నిబట్టే పన్ను వసూళ్లుంటాయన్నారు.
క్రిప్టో ట్రేడింగ్ కోసం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) నిబంధనను పరిచయం చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘ఒకవేళ కొత్త చట్టం వస్తే అందులో అంతా ఉంటుంది’ అని సమాధానం దాటవేశారు. ఇదిలావుంటే ఇటీవలే బీజేపీ నేత జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ క్రిప్టో ఫైనాన్స్పై చర్చించిన విషయం తెలిసిందే. గతకొద్ది నెలలుగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై మదుపరులు అమితాసక్తిని కనబరుస్తున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగగా, క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధించడం కంటే వాటి నియంత్రణకే ఎక్కువమంది ఈ సందర్భంగా మొగ్గు చూపారు. క్రిప్టో కరెన్సీల అంశంపై ఆర్బీఐ, వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ప్రధాని మోదీ సైతం చర్చలు జరిపిన సంగతి విదితమే. ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీలపై బిల్లును కూడా కేంద్రం పరిచయం చేసే వీలున్నది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే ఏడాది ఓ డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాజెక్టు కింద ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ నయా క్రిప్టోకరెన్సీని ఆర్బీఐ విడుదల చేయవచ్చన్న అంచనాను ఆర్బీఐ పేమెంట్, సెటిల్మెంట్ల శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ పీ వాసుదేవన్ వ్యక్తం చేశారు. నిజానికి వచ్చే నెలే ఓ డిజిటల్ కరెన్సీ రావచ్చని ఆర్బీఐ గవర్నర్ దాస్ గతంలో సంకేతాలిచ్చారు. అయితే మరికొంత ఆలస్యం కూడా కావచ్చన్నారు. క్రిప్టోకరెన్సీలపై దాస్ ఇప్పటికే చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేయగా, దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని చెప్తున్నారు. ఈ లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ బ్యాంకులను, తమ పర్యవేక్షణలోని ఇతర ఆర్థిక సంస్థలను ఏప్రిల్ 6, 2018న ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను గతేడాది మార్చి 4న సుప్రీం కోర్టు పక్కకు పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ డిజిటల్ కరెన్సీని తామే తెస్తే ఎలా ఉంటుందన్నదానిపై ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 5న అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసింది.