తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మే 17న అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో మే 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.