హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): ఆదివాసి, గిరిజన సంక్షేమానికి ఆరోగ్యం, విద్య కీలకమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివాసీలలో పౌష్టికాహార లోపాన్ని సరిదిద్ది వారిని అభివృద్ధి చేయడం కోసం ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు వారి ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రాజ్భవన్లో ఆదివాసీ ప్రజల పౌష్టికాహార స్థితిని మెరుగుపరిచే అంశంపై రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్, ఇఎస్ఐసీ మెడికల్ కాలేజీ, కేఎన్ఆర్ వైద్య విశ్వ విద్యాలయం, వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్కు చెందిన ప్రతినిధులతో గవర్నర్ గురువారం సమీక్ష నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ గిరిజన ప్రజల్లో పరిశుభత్రపై అవగాహన కల్పించాలని, తద్వారా వారు ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చునన్నారు. గిరిజనులకు జీవనోపాధిని కల్పించడానికి, ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడానికి వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన విశ్వ విద్యాలయాలు కృషి చేయాలన్నారు. ప్రధానంగా సుస్థిర వ్యవసాయ పద్ధతులైన పశు పోషణ, పాల ఉత్పత్తి, వ్యవసాయం, కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వాలని గవర్నర్ వారిని కోరారు. సమీక్షలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.