గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి కథానాయిక. లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. గోపీచంద్ నటిస్తున్న ముప్పయ్యవ చిత్రమిది కావడం విశేషం. కుటుంబ అనుబంధాలు, యాక్షన్ అంశాల కలబోతగా భూపతిరాజా చక్కటి కథను అందించారని, గోపీచంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.