వాషింగ్టన్ : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్ ప్రారంభించింది. క్లినికల్ ట్రయల్స్ కోసం నాలుగు దేశాల్లో 4,500 మందికిపైగా పిల్లలను ఎంపిక చేసింది. అమెరికా, ఫిన్లాండ్, పోలాండ్, స్పెయిన్లో ఈ ట్రయల్స్ నిర్వహించనుంది. మొదటి దశలో భాగంగా తక్కువ సంఖ్యలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలపై టీకా ట్రయల్స్ ప్రారంభించినట్లు ఫైజర్ తెలిపింది. ప్రస్తుతం 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఫైజర్ అభివృద్ధి చేసిన టీకాకు అమెరికా, యురోపియన్ యూనియన్లో 12 సంవత్సరాల కంటే పిల్లలకు వేసేందుకు అత్యవసర వినియోగం కింద అనుమతి లభించింది.
ఫైజర్ కంపెనీ జర్మన్ కంపెనీ బయో ఎంటెక్ భాగస్వామ్యంతో కరోనా టీకాను తయారు చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సినే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన తొలి టీకా. టీకా ట్రయల్స్ కోసం 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు 10 మైక్రోగ్రాముల చొప్పున రెండు మోతాదులు ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. కౌమార దశకు చేరిన, పెద్దలకు ఇచ్చే వ్యాక్సిన్ మోతాదులో మూడింట ఒకటో వంతని చెప్పింది. కొన్ని వారాల తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలపై టీకా ట్రయల్స్ ప్రారంభిస్తామని పేర్కొంది. వారికి మూడు మైక్రోగ్రాముల వ్యాక్సిన్ ఇస్తామని చెప్పింది.
ఇప్పటికే ఫైజర్తో పాటు మోడెర్నా 12-17 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. పూర్తిస్థాయి ఫలితాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రెండు సంస్థలు నిర్వహించిన ప్రయోగ ఫలితాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ వ్యాక్సిన్ వేసేందుకు ఎఫ్డీఏ అనుమతులు జారీ చేసింది. గత నెలలో ఆస్ట్రాజెనెకా సైతం 6-17 సంవత్సరాల పిల్లలపై యూకేలో ట్రయల్స్ ప్రారంభించింది. మరో వైపు జాన్సన్ అండ్ జాన్సన్ పిల్లలపై ట్రయల్స్కు సిద్ధమవుతున్నది. చైనాకు చెందిన సినోవాక్ టీకా మూడు సంవత్సరాల వయస్సు పిల్లలపై ప్రభావవంతంగా ఉందని పేర్కొంది.