తిరుమల : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రెండు సంవత్సరాల పాటు కొవిడ్ కారణంగా శ్రీవారిని దర్శించుకోని భక్తులకు తీపి కబురు తెలియజేసింది. కొవిడ్ తగ్గితే ఈనెల 15 వ తేదీ నుంచే శ్రీవారి భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈరోజు టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు.
మార్చి 1 నుంచి ఆర్జిత సేవలకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. దర్శన టికెట్లు అమ్మే నకిలీ వెబ్సైట్లు గుర్తించి తొలగిస్తున్నామని, ఇందుకు నకిలీ వెబ్సైట్ల కట్టడికి టీటీడీ సైబర్ విభాగం నిరంతర నిఘా ను పెట్టిందని వెల్లడించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే భక్తులు టికెట్లు పొందాలని ఆయన సూచించారు. తిరుమలలో విపత్తుల నిర్వహణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ప్రమాదాలను ముందుగానే గుర్తించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 16న అంజనాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం ఉంటుందని ఈవో వెల్లడించారు.