ఖైరతాబాద్, నవంబర్ 21 : చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చిన్నప్పటి నుంచే గుడ్, బ్యాడ్టచ్లపై బోధించాలని వక్తలు పిలుపునిచ్చారు. శ్రీస్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళల భద్రతపై ఆదివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐఆర్ఎస్ అధికారి జీవన్లాల్ లవుడ్యా మాట్లాడుతూ బ్యాడ్, గుడ్టచ్ అనే దానిపై పిల్లలకు చిన్నప్పుడే బోధించడం ద్వారా వారికి రక్షణ కల్పించిన వారమవుతామని చెప్పారు. లైంగిక వేధింపుల ఘటనలు జరిగినప్పుడు బాధితులకు రక్షణగా ఉండి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భావితరాలకు ఇలాంటివి జరుగకుండా చూడవచ్చన్నారు.
శ్రీస్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి తారాచంద్ మాట్లాడుతూ చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు పోక్సో చట్టం 2012 తీసుకువచ్చారని, 18ఏండ్లలోపు ఉన్న వారిపై ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ చట్టం పరిధిలోకి వస్తుందని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తారన్నారు. ఈసమావేశంలో సినీ నటుడు అభినవ్, న్యాయవాది అమృత పాల్గొన్నారు.