ఈ వ్యాస శీర్షిక మహాకవి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలోనిది. ఆ పాట ఇట్లా సాగుతుంది… దేశ సంపద పెరిగే రోజు/ మనిషి మనిషిగా బ్రతికేరోజు / గాంధీ మహాత్ముడు కలగన్న రోజు/ నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు/ అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరు కలసి/ సహకారమే మన వైఖరి ఐతే ఉపకారమే మన ఊపిరి ఐతే/ ఆ రోజెంతో దూరం లేదూరన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో/ తీయగా బ్రతుకంతా మారగా కష్టాలు తీరగా సుఖశాంతులూరగా/ ఆకాశ వీధుల ఎదురే లేకుండా ఎగురును మన జెండా… యెంత తీయగా, సందర్భోచితంగా ఉన్నది కదా? అవును… అదిగో చూడు, నేడే భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం!
ఈ మధ్యాహ్నం 1.20 నిమిషాలకు తెలంగాణ భవన్లో ఎగిరే బీఆర్ఎస్ జెండా కేవలం పార్టీ నాయకుల, కార్యకర్తల సంబురం కాదు. రాబోయే రోజులలో విశ్వవిఖ్యాతం కాబోయే భారత కీర్తి పతాకకు కర్టెన్ రైజర్! జరగనున్నది కేవలం పార్టీ పేరు మార్పు కాదు.. ఈ దేశ పేరు ప్రతిష్ఠలను నిలబెట్టే ఒక పసికందు జననం! స్వాతంత్య్ర వీరుల ఆకాంక్షను, అమరుల త్యాగాలను గుండె నిండా మననం చేసుకుని అప్రతిహత పురోగమన మార్గంలో సాగే భారత భారతికి నిలువెత్తు నీరాజనం.
ఈ విశేషణాలు అన్నీ ఉత్తుత్తివి కావని 27 ఏప్రిల్, 2001న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాతి 21 సంవత్సరాలలో సాధించిన విజయాలు, అందుకున్న శిఖరాలు, తన ప్రజలకు చేకూర్చిన సంక్షేమాలు తెలిసినవారు ఎవరైనా ఒప్పుకొంటరు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా నాడు పుట్టిన పార్టీ అక్కడితో ఆగలేదు. సాధించిన దానికి సంతృప్తిని పొంది ఆగిపోవడానికి కేసీఆర్ రాజకీయ నాయకుడు కాదు. రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు. ఎందరో అమరుల త్యాగాల ఫలంగా, సకల జనుల పోరాట ఫలితంగా, తన అనితర సాధ్య రాజకీయ నేతృత్వంలో సాకారమైన రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపినవాడు. అక్కడితో ఆగితే అది చరిత్ర సృష్టి యెట్లా అవుతుంది? అంతటి మహత్తర నాయకత్వం, దాని ఫలితాలు ఒక్క తెలంగాణకు దక్కించి ఊరుకుంటే స్వార్థ చింతన అవదా? అన్ని అభివృద్ధి సూచీలలో దివాలా తీస్తున్న దేశాన్ని, అంతర్జాతీయంగా నానాటికీ అప్రతిష్ఠ పాలవుతున్న దేశాన్ని తన మానాన వదిలేసి కృష్ణా.. రామా అని కూచోవడానికి ఆయన సన్యాసి కాదు. రాజర్షి!
కాబట్టే… భారత్ రాష్ట్ర సమితి పుట్టింది. తెలంగాణ ప్రజలు నేడు పొందుతున్న ప్రజాస్వామ్య ఫలాలు దేశమంతా దక్కాలనే తపనకు ప్రతిరూపమే బీఆర్ఎస్. తాజాగా మొన్న జగిత్యాలలో కేసీఆర్ చెప్పిన్రు ఈ దేశాన్ని కాపాడుకుందాం అని. దేశ ప్రజల శ్రమ సంపదను దళారులకు దోచిపెట్టే విధానాలకు చెక్ పడాల్సిందే. ఎల్ఐసీ, సింగరేణి, పోర్టులు, గనులు, కార్ఖానాలు, జాతీయ బ్యాంకులు సహా లాభాల పంట పండిస్తున్న అనేకానేక భారత ప్రజల ఆస్తులను రక్షించి తీరవలసిందే. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణలు తెచ్చి, నిస్సహాయ స్థితిలోకి రైతులను నెట్టి, వ్యవసాయం నుంచి దూరం చేసి, చెంచాగాళ్ళకు ఆ రంగాన్ని కూడా ధారాదత్తం చేసే పార్టీని పాతాళం కంటే కిందకు పూడ్చి వేయవలసిందే. ఒక్క మన దేశానికే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు అన్నం పెట్టేంత పంట మన రైతులు పండించగలరు. ప్రపంచ ఫుడ్ సెక్యూరిటీ ప్రదాతగా మనం మనగలిగే అవకాశాలు పుష్కలం. సిరులు సమకూర్చే మిరియాల పంట ఉండగా మీ కప్పాలు ఎందుకు దండగ అని ఆనాడు వాస్కోడాగామా అన్నాడంటే ఊరికే అనలేదు. భారత్ రత్నగర్భ అని తెలుసుకున్న బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్, స్పానిష్ వలస పాలకులు రెండొందల ఏండ్లకు పైగా మనను కొల్లగొట్టినా ఇప్పటికీ మన దేశం రత్నగర్భయే.
రత్నాలు, వజ్రాలు అంటే కేవలం మినరల్స్ కాదు. అవి తవ్వగా తవ్వగా అయిపోయేవి. నిజమైన అర్థంలో రత్నాలు అంటే మన జాతి రత్నాలు. వజ్రాలు అంటే వజ్ర సంకల్ప నాయకులు. అందుకే… 1947లో సున్నా దగ్గర మొదలైన మన ప్రస్థానం వజ్రోత్సవాల నాటికి ఫీనిక్స్లా ఉవ్వెత్తున ఎగిసింది. నేడు ప్రపంచంలోనే అయిదవ ఆర్థిక శక్తిగా తయారయినం. 1600 సంవత్సరానికి పూర్వపు ప్రభకు చేరుకునే దారిలో ఉన్నాం. గుప్తుల కాలం స్వర్ణయుగం అని చరిత్ర పుస్తకాలు మనకు చెప్పినయి. మరొక ఇరవై అయిదేండ్ల తర్వాత భారత్ వందేండ్ల స్వాతంత్య్ర ఉత్సవాల నాటికి ఆ స్వర్ణయుగం సాకారం అయి తీరుతుంది. అది మనం నడిపే చరిత్ర. అది జరగాలంటే, దేశాన్ని మధ్యయుగాల బాట పట్టిస్తున్న బీజేపీ దిగి పోవాల్సిందే. విద్వేష విషవృక్షాన్ని కూకటివేళ్ళతో పెకలించి పారేయాల్సిందే.
ఈ ‘వేదిక’ పేజీలలోనే ఎన్నోసార్లు చెప్పుకొన్నాం. పార్టీలకు సంబంధం లేని ఎందరో మేధావులు, విశ్లేషకులు, దేశం బాగుపడాలని తపించేవారు ఈ పత్రిక సహా ఎన్నో పత్రికలలో రాస్తున్నరు. గడచిన ఎనిమిది సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క మంచి పని, పనికొచ్చే పని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసింది లేదు. ప్రతి ఒక్క వ్యవస్థనూ నిర్వీర్య పరిచింది మోదీ ప్రభుత్వం.
స్వాతంత్య్ర పోరాటం సహా ఎలాంటి ప్రజా ఉద్యమాలలో పాత్ర లేని ఆర్ఎస్ఎస్/ బీజేపీ మూక నెహ్రూ, గాంధీ, బోస్, పటేల్ లాంటి కీర్తిశేషులలో కూడా చీలిక తెచ్చే కౌటిల్యానికి తెగబడుతున్నాయి. హత్యలు, రేప్ల లాంటి దారుణాలకు పాల్పడిన వారిని జైళ్ళ నుంచి విడిపించి, పూలదండలు వేసి మరీ స్వీట్లు పంచుతున్నారు. ప్రజలకు రాజ్యాంగ హక్కులను రద్దు చేసే దుర్మార్గానికి తెగబడుతున్నారు. హక్కుల గురించి మాట్లాడే వాళ్ళను హత్యలు చేయడం, జైళ్లలో కుక్కడం నిత్యకృత్యమైంది. స్వాములు, సన్యాసులు కూడా ప్రభుత్వాలను పడగొట్టే నీచ రాజకీయాలు చేస్తున్నారు. సనాతన ధర్మానికి, అసలైన హిందూ భావనకు తలవంపులు తెస్తున్నారు.
అనాలోచితంగా ‘నోట్ల రద్దు’ చేయడం వల్ల ఏటీఎం క్యూలలో చనిపోయిన వారి గురించి, దిక్కుతోచక నిస్సహాయంగా కరోనాకు రాలిపోయిన వారి గురించి, లక్షలాది వలస కార్మికుల దుఃఖభరిత జీవనం గురించి మనమంతా ఎన్నోసార్లు చర్చించుకున్నాము, బాధపడ్డాము. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఇబ్బందుల గురించి; తమవి కాని ప్రభుత్వాల పట్ల ఆర్థిక సహాయ నిరాకరణ, తద్వారా జరిగే ప్రజల ఆర్థిక జీవన విధ్వంసం గురించి, రిటైర్డ్ న్యాయమూర్తులకు, ఆర్మీ అధికారులకు పదవీ విరమణ అనంతరం ఉన్నతమైన పదవులు సృష్టించి యిచ్చి మరీ వ్యవస్థలను ప్రలోభపెట్టడం గురించి మనమంతా ఆవేదన చెందాము.
ఎప్పుడూ లేనంత నిరుద్యోగం, పేదరికం తాండవిస్తూ ఉంటే, ప్రజలు 170 శాతం పెరిగిన ధర చెల్లించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్యాస్ సిలిండర్ కొనడం శ్రేష్ఠ్ భారత్కు నిదర్శనమా? మనం చూస్తూ ఊరుకుందామా? జీఎస్టీ వల్ల విద్యార్థులు, గృహిణులు, రైతులపై మరింత భారం పడుతూ ఉంటే మౌనం వహిద్దామా? పెరుగు, లస్సీ, మజ్జిగ, మాంసం, పనీర్, తేనె, చేపలపై కూడా 5 శాతం పన్ను వేస్తే నోరు మెదపకుండా ఉందామా? స్కూలు పిల్లలు వాడే పెన్సిల్, షార్ప్నర్పైన 18 శాతం పన్ను ఎందుకు? మ్యాపులు, చార్టులు, అట్లాస్పై 12 శాతం ఎందుకు? సామాన్యులకు విద్యను భారం చేస్తరా? ఎండు చిక్కుళ్ళు, గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, సేంద్రియ ఆహారంపై 5 శాతం బాదుడు ఎందుకు? కనీసమైన నిత్యావసర వస్తువులపై ఎడాపెడా బాదేసి; వజ్రాలపై మాత్రం 1.5 శాతం, బంగారంపై 3 శాతం మాత్రమే ఎందుకు? లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు, ఎన్నడూ లేనంత రూపాయి పతనం, ఏడాదికి 1.30 కోట్ల ఉద్యోగాల కోత, 8.3% నిరుద్యోగం. 38% పరిశ్రమలు మూత… అడగవద్దా ఇవన్నీ? అడిగితే ఈడీ, ఐటీ దాడులా?
అందుకే బీఆర్ఎస్ రూపంలో మరో పోరాటానికి ముందుకు వచ్చారు కేసీఆర్. ఆయన ప్రయత్నాలకు, అందులోని చిత్తశుద్ధికి తెలంగాణ వాళ్ళు, తెలుగువాళ్లు మద్దతు ఇవ్వడం సహజమేగానీ, 26 రాష్ర్టాల నుంచి వచ్చిన రైతాంగ ప్రతినిధులు ‘దేశ్ కీ నేతా కేసీఆర్’ అని నినదించడం నిశ్చయంగా సంభ్రమాశ్చర్యమే. దేశంలోని పలు ప్రభుత్వాధినేతలు, జాతీయనాయకులు కేసీఆర్ కేంద్రంగా చర్చలు జరుపడం మనకు గర్వకారణమే. జాతీయ మీడియా కేసీఆర్ చుట్టూ మూగడం విజయ సంకేతమే. దళితబంధు రూపేణా దళితుల సాధికారతను కొత్తపుంతలు తొక్కిస్తున్న కేసీఆర్కు దేశవ్యాప్త దళితుల నుంచే కాదు, బహుజనులందరి నుంచి కూడా మద్దతు లభిస్తున్నది.
జెండా వస్త్రం, జెండా కర్ర తమంత తాముగా ఉద్వేగం రగిలించలేవు. దానికో దిమ్మ అవసరం. ఎగరేయడం అవసరం. అన్నిటికీ మించి సందర్భం అవసరం. అట్లాగే బీజేపీ ముక్త భారత్ సాధనకు అత్యంత కీలకమైన ముడిపదార్థం ప్రజలే అయినప్పటికీ వారి ఆకాంక్షల్ని అస్ర్తాలుగా చేసి, ఎన్నికల రణరంగాన ఎక్కుపెట్టి, మెజారిటీ ఎంపీలతో పార్లమెంటులో అడుగు పెట్టేలా చేసేది రాజకీయ నాయకత్వమే. గల్లీలో పోరునూ, ఢిల్లీలో రాజనీతినీ (రాజకీయం కాదు, రాజనీతే) సమ్మిళితమూ సమన్వయమూ చేయగలిగే నాయకుడి అవసరం నేడు ఉన్నది. ఆ అవసరం ఆ నాయకుడి కంటే, దేశానికి ఎక్కువ ఉన్నది.
ఆ యజ్ఞం ఈ రోజు మధ్యాహ్నం 1.20కి మొదలవుతున్నది. రండి అందరమూ కలిసి కలలను సాకారం చేసుకుందాం. ఆకాశ వీధుల ఎదురే లేకుండాఎగురును మన జెండా… జై బీఆర్ఎస్.. జై జై భారత్
– శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371