న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బంగారం భగభగమండుతున్నది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న అతి విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. దేశీయ కరెన్సీ రూపాయికి భారీ చిల్లులు పడటం, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారంవైపు మళ్లించడంతో ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర ఏకంగా రూ.1,650 ఎగబాకి రూ.51,620 పలికింది. అంతకుముందు గోల్డ్ధర రూ.49,970గా ఉన్నది. గడిచిన ఆరు నెలల్లో ఒక్కరోజు ఇంతటి స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వెండి మరింత వెలిగింది. కిలో ధర రూ.2,350 అధికమై రూ.66,260 పలికింది.
రాష్ట్రంలో బంగారం మరింత ప్రియమైంది. గత కొన్ని రోజులు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పసిడి హైదరాబాద్లో రూ.51 వేల మైలురాయిని అధిగమించింది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.930 అధికమై రూ.51,110 పలికింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.850 పెరిగి రూ.46,850కి చేరుకున్నది. అలాగే వెండి ధర మరో రూ.600 పెరిగి రూ.70,600 వద్ద ముగిసింది. ఉక్రెయిన్పై రష్యాపై దాడులు, రూపాయి విలువ 99 పైసలు పడిపోవడం బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,942 డాలర్లకు చేరుకున్నది. అలాగే వెండి 25.07 డాలర్లుగా నమోదైంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం వచ్చే రెండేండ్లలో రికార్డు స్థాయికి చేరుకోనున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉండటం, అధిక ద్రవ్యోల్బణంతో వచ్చే రెండేండ్లకాలంలో పసిడి ధర రూ.10 వేల వరకు పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఈ ఏడాదిలో తులం బంగారం ధర రూ.55 వేలకు చేరుకోనుండగా..వచ్చే ఏడాది రూ.62 వేలు పలుకనున్నదని పేర్కొంటున్నారు.