ఆన్లైన్లోనూ జోరుగా విక్రయాలు
ఉత్పత్తులపై నెలాఖరు వరకు 40శాతం రాయితీ
వృత్తుల నైపుణ్యానికి అద్దం పట్టేల అద్భుత రూపాలు
రూ.30 నుంచి రూ.5 లక్షల వరకు ధరలు
సిటీబ్యూరో, మార్చి 29 : చూడముచ్చటైన బొమ్మలు.. చూపరులను ఆకట్టుకునే బహుమతులు.. ఇంటికి అందాన్ని ఇచ్చే అలంకరణలు.. చేనేతలు.. వివిధ వృత్తుల ఉత్పత్తులు.. గంధపు చెక్కళ్లు.. అమ్మాయిలు ఇష్టపడేలా జ్యువెలరీ.. బ్యాగులు.. మాస్క్లు.. ఒక్కటేమిటీ.. ఇలా వందల కొలదీ పర్యావరణ ఫ్రెండ్లీ ఉత్పత్తులన్నీ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్లో కొలువుదీరాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల హస్తకళల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉన్నాయి. సర్కార్ ప్రోత్సాహంతో ప్రతి ఏడాది మార్చిలో 40 శాతం డిస్కౌంట్ ఉండటంతో గోల్కొండ ఉత్పత్తులకు భలే ఆదరణ లభిస్తున్నది.
నగరంలోని ముషీరాబాద్, అబిడ్స్, ఆర్టీసీ క్రాస్రోడ్డు, బంజారాహిల్స్లో గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్స్ ఎంపోరియాలు ఉన్నాయి. వీటిలో తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ర్టాల వృత్తుల ఉత్పత్తులన్నీ విక్రయానికి ఉన్నాయి. ముఖ్యంగా నిర్మల్ బొమ్మలు, ఆదిలాబాద్ ట్రైబల్ ఉత్పత్తులు, వరంగల్ పెయింటింగ్స్, సిద్దిపేట, పోచంపల్లి, నారాయణ్పేట చేనేత వస్ర్తాలు, కొండపల్లి బొమ్మలు, ఆగ్ర గిఫ్ట్స్, గన్ మెటల్స్, మార్బెల్లెదర్, డోక్రా, బిద్రీ, స్వచ్ఛమైన సిల్వర్తో తయారు చేసిన అలంకరణ వస్తువులు, పేపర్తో రూపొందించిన బొమ్మలు, మిర్రర్లేడీ తదితర వెరైటీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. రూ. 30 నుంచి 5 లక్షల విలువజేసే సాండిల్ వుడ్ నటరాజ్ వరకు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్లోనూ గోల్కొండ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. ఫ్లిప్కార్ట్, ఈ గోల్కొండ, షాపీ 5, బంజారాహిల్స్ గోల్కొండ ఎంపోరియం తదితర వాటిలో షాపింగ్ చేయొచ్చు. ప్రతి రోజూ సుమారు రూ. లక్ష వరకు ఆన్లైన్ అమ్మకాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
40 శాతం డిస్కౌంట్
ఈనెలాఖరు వరకు 40 శాతం డిస్కౌంట్ ప్రకటించాం. ప్రతి ఏడాది మార్చిలో ఈ ఆఫర్ను అందిస్తాం. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మానవ ఆధారిత ఉత్పత్తులకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. స్వయంగా అన్ని వృత్తుల వారు రూపొందించిన బొమ్మలు, అలంకరణ వస్తువులు, చేనేత దుస్తులు ఇలా అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి.
– కేవీఎస్.నాగేశ్వరరావు, మేనేజర్, గోల్కొండ హ్యాండ్లూమ్
ఎంపోరియం, బంజారాహిల్స్.