జంగంపల్లి ఓటీ-2 వద్ద నీటిని వదిలిన విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21: యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా మహాయాగం అంకురార్పణ పూజా కార్యక్రమానికి గోదావరి జలాలు గలగలమంటూ గండి చెరువులోకి చేరాయి. యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి ఓటీ-2 కాల్వ నుంచి యాదాద్రి క్షేత్ర సమీపంలోని గండి చెరువులోకి ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆదివారం నీటిని విడుదలచేశారు. స్వామివారి తెప్పోత్సవం నిర్వహించే గండి చెరువును గోదావరి జ లాలతో నింపాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కాలువను ఏర్పాటుచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను గండి చెరువుకు తరలిస్తున్నారు. గోదావరి జలాలు యాదాద్రి స్వామివారి చెంతకు చేరడం సంతోషంగా ఉన్నదని సునీత తెలిపారు. కేసీఆర్ మాట నిలబెట్టుకొన్నారని, లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులు సీఎంకు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు.