భూదాన్ పోచంపల్లి, జూలై 14 : పోచంపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ద్వారా భువనగిరి నియోజక వర్గానికి రూ.56 కోట్ల నిధులు తీసుకొచ్చామని, అందులో భాగంగా పోచంపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. నేతన్నల నిలయమైన పోచంపల్లిని మరింత అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో పాటు రోడ్, డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పన, అమృత పథకం కింద రిజర్వాయర్ నిర్మాణం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.7.90 కోట్ల నిధులు కేటాయించమని చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి పెద్ద చెరువు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి , వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కొండమడుగు ఎల్ల స్వామి, పెద్దల చక్రపాణి, బాతుక లింగస్వామి, కర్నాటి వరలక్ష్మి, రాపోలు కావ్య, దేవరాయ కుమార్, కో ఆప్షన్ సభ్యులు మద్ది మధుసూదన్ రెడ్డి, సయ్యద్ ఎజాస్, పబ్లిక్ హెల్త్ డీఈ మనోహర, ట్రాన్స్ కో ఏఈ శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఏఈ లోకేష్, మున్సిపల్ ఏఈ జగపతిబాబు, హెచ్ఎండీఏ ఏఈ వెంకన్న, మున్సిపల్ మేనేజర్ నిర్మల, సీనియర్ అసిస్టెంట్ రాజేష్, హౌసింగ్ ఏఈ శివాజీ పాల్గొన్నారు.